భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఆ దిశగా నేడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తుండగా, నైపుణ్యాభివృద్దిలో గేమ్ ఛేంజర్ గా భావిస్తోన్న ‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తాజాగా అధికారులను ఆదేశించారు.
🔸 ఐటీ కంపెనీలతో పాటు అధునాతన పరిశ్రమలన్నింటికి అందుబాటులో ఉన్నందున గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
🔸 ఈ.ఎస్.సి.ఐ లో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ ను సోమవారం పరిశీలించిన అనంతరం అక్కడే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు , ముఖ్యమంత్రి సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి , పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
🔸 స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐ.ఎస్.బి తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. అప్పటివరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు అందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
🔸 పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా లభించేలా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు. స్కిల్ వర్సిటీ ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి అంశాలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని అధికారులకు చెప్పారు.