భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కళాశాలకు నిర్ణయించిన ఫీజుల వివరాలు ఇవే..అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షల వరకు ఇంజినీరింగ్లో బీటెక్ కోర్సులకు ఫీజులు నిర్ణయించారు. అలాగే అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల ఫీజు ఉన్న కళాశాలలు 114 కాగా, రూ.లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున ఫీజును ఖరారు చేశారు.
ఈ కాలేజీల్లోనే..గుంటూరులోని ఆర్వీఆర్అండ్జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్ సిద్దార్థ, భీమవరంలోని ఎస్ఆర్కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్ కాలేజి ఫర్ ఉమెన్ కాలేజీలకు రూ.1.05 లక్షల చొప్పున, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు రూ.1.03 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఫీజు రూ.93,700గా ఉంది.
ఇతర ఖర్చులన్నీ..ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ ఫీజుల కిందికే వస్తాయి. అదనంగా ఎలాంటి ఫీజులను కాలేజీలు వసూలు చేయకూడదని ఉత్తర్వుల్లో ఉంది.
వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఏ ఇంజనీరింగ్ కాలేజీల్లో నైనా, ఎవరైన పైన చెప్పినవాటికి అదనంగా ఫీజులు వసులు చేస్తే.. చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్గౌర్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో మేనేజ్ మెంట్ కోటా కింద కళాశాలలు ఎంత ఫీజు వసూలు చేయాలి అనే వివరాలు మాత్రం తెలుపలేదు.
మరికొన్ని తాజా వార్తా విశేషాలు…