భారత్ సమాచార్, జాతీయం ;
భారతదేశ కరెన్సీ పైన జాతి పిత మహాత్మ గాంధీతో పాటుగ దేశ వారసత్వ సంపద గురించి, దేశం యొక్క సంస్కృతి గురించి తెలిపే చిహ్నాలను రిజర్వ్ బ్యాంక్ ఇండియా ముద్రిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మనం వంద రూపాయల నోటుకు ఒక వైపు ఉన్న చిత్రం ‘రాణీ కా వావ్’ అద్భుత నిర్మాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం… ఈ నిర్మాణం ఒక అద్భుతమైన మంచి నీటి బావి. ప్రస్తుతం ఇది గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్ జిల్లాలో ఉంది. వంద రూపాయల నోటు పై ఈ చిత్రం ముద్రించే వరకు దీని ప్రత్యేకతలు పెద్దగా ప్రాముఖ్యం అవ్వలేదు.
మాములుగా దేశ వారసత్వ సంపదగా ఉన్న చాలా మటుకు నిర్మాణాలు పూర్వపు రాజులు… వారు కొలిచే దేవుళ్ల కోసమో, తమ రాణుల కోసమో కట్టించారు. కానీ ఈ నిర్మాణాన్ని మాత్రం సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ -1 గుర్తుగా 1050-1100 వ సంవత్సరాల మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించిందని చరిత్రకారుల అభిప్రాయం. మొత్తం 7 అంతస్థుల్లో నిర్మించిన ఈ బావి పొడవు దాదాపు 213 అడుగులు. వెడల్పు 66 అడుగులు, లోతు 92 అడుగులు. భారతదేశంలో మిగిలిన నిర్మాణాలన్ని నేల మీద నుండి పైకి అంతస్థులుగా నిర్మిస్తే దీన్ని మాత్రం ప్రత్యేకంగా భూమి లోపలికి 7 అంతస్థులుగా నిర్మించారు. భూమి లోపలికి తవ్వుతూ నిర్మాణాలు చేయడం ఎంతో కష్టమైనప్పటికి ఈ నిర్మాణం భారతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుత ఉదాహరణగా నిలిచిపోయింది.
ఈ బావి నిర్మాణంలో అద్భుత కథలు చెక్కిన 215 స్థంభాలు, దాదాపు 800 శిల్పాలు ఉన్నాయి. గోడల మీద దశావతారం కథలు, ఇతర పురాణాలు, స్త్రీల గురించి ఎన్నో బొమ్మలు చెక్కబడ్డాయి. ఈ బావి లోపలికి దిగిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది. 7 అంతస్తులు దిగిన తరువాత బావి ఉంటుంది. అప్పట్లో బావి చుట్టూ ఔషధ మొక్కలు కూడా పెంచారు అందుకే ఈ బావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవని జనాల్లో బాగా ప్రచారం ఉండేది. బావి దగ్గరే ఓ రహస్య తలుపు మూయబడి ఉంటుంది. అప్పట్లో శత్రువులు దాడి చేసినపుడు ఆ తలుపు తెరిచి లోపల 30 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలో సిద్దాపూర్ అనే పట్టణానికి చేరే ఏర్పాటు చేశారు.
కానీ ఒకసారి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈ బావి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. 1980లో ASI (ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియా) జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది.
2014లో UNESCO (యూనెస్కో) దీన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చి దీని కీర్తి విశ్వవ్యాప్తం చేసింది. కానీ 2018 జులైలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 100 రూపాయల నోటు మీద ఈ చిహ్నం ముద్రించే వరకు చాలా మంది భారతీయులకు ఈ అద్భుత నిర్మాణం గురించి పెద్దగా తెలీదు.