భారత్ సమాచార్, జాతీయం ;
మానవాళి కంటికి కనిపించని శత్రువుల్లా వైరస్ లు విబృంభిస్తున్నాయి. కరోనా చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోనే లేదు. అప్పుడే కొత్త వైరస్ లు సవాలు విసురుతున్నాయి. భారతదేశ రాష్ట్రాలలో ఆందోళనకరంగా వైరస్లు విజృంభిస్తున్నాయి. చాందీపురా, నిఫా, జికా… నార్వక్ ప్రాణాంతక వైరస్ లు కల్లోలం సృష్టిస్తున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని భారత వైద్యులు సూచిస్తున్నారు. అటు ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు చాందీపురా వైరస్తో సతమతమవుతుంటే, మహరాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తోంది. వీటికి తోడు కేరళలో నిఫా వైరస్ జోరు పెంచింది. మొత్తానికి 3 ప్రాణాంతక వైరస్లు 4 రాష్ట్రాలను వణికిస్తున్నాయి. తాజాగా గుజరాత్లో 50 మంది చాందీపురా వైరస్ బారిన పడితే..వారిలో 16 మంది మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.
జికా వైరస్
మహారాష్ట్ర 2021 నుంచి అత్యధిక సంఖ్యలో జికా వైరస్ కేసులతో పోరాడుతోంది.
నిఫా వైరస్
మరోవైపు కేరళ రాష్ట్రంలో మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ సోకి మరణించడంతో కేరళ ప్రభుత్వం వైరస్ నివారణ చర్యలను వేగవంతం చేస్తోంది. ఇది అంటువ్యాధి కావడంతో వైరస్ విస్తరించకుండా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైను కేరళలో వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
చాందీపూర వైరస్
చాందీ పూర వైరస్ సోకిన సాండ్ఫ్లైస్ లేదా డ్రైన్ఫ్లైస్ నుంచి కాటు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. తాజాగా గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా చాందీపురా 50 కేసులు నమోదైతే వారిలో 16 మంది మరణించారు. వైరస్ని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభావిత జిల్లాల్లో మలాథియాన్ పౌడర్ను పిచికారీ చేస్తున్నారు. జ్వరసంబంధమైన కేసులకు ఇంటెన్సివ్ చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నర్సులతో పాటు ఆశా, అంగన్వాడీ వర్కర్లు వంటి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం, చందీపురా వైరస్కు నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు, కాబట్టి రోగలక్షణ నిర్వహణపై దృష్టి సారించడంతో పాటు సంక్లిష్టతలను నివారించడంలో సహాయక సంరక్షణ అవసరం.
నార్వాక్ వైరస్
హైదరాబాద్లో నార్వాక్ వైరస్ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి నార్వాక్ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే… ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు. చికిత్స అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వైరస్ ప్రబలుతుందని వైద్యులు అంటున్నారు . తీవ్రమైన డీహైడ్రేషన్, నిస్సత్తువ, ఏం తినలేని పరిస్థితి ఉంటే మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని చెబుతున్నారు.