భారత్ సమాచార్, హైదరాబాద్ ;
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తెలిపారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
➡️ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఖ్ విలేజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాధాన్యతను సీఎం రేవంత్ వివరించారు.
➡️రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.
➡️అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందజేస్తారు.
➡️ఇందుకోసం 3 నుంచి 5 వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ప్రతిపక్షాలు దీనిపై ఎవైనా సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వాలని సూచించారు.
➡️కుటుంబంలో సభ్యులు పెరిగినందున ప్రజలంతా కుటుంబ డిజిటల్ కార్డు కోసం వివరాలను నమోదు చేయించుకోవాలి. ఇందులో అవసరమైన మార్పుచేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు.
➡️ఒక్క క్లిక్ తో కుటుంబ సమగ్ర సమాచారం ఉండాలన్న ఆలోచనతో ఈ విధానం తీసుకొచ్చామని వివరించారు.
➡️ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్ తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పొందడానికి ప్రజలకు వీలుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ , ఎమ్మెల్యే శ్రీగణేశ్ , మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.