భారత్ సమాచార్, చెన్నై ;
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ సంస్థ (ఆర్ఎంసీ) తాజాగా వెల్లడించింది. ఈ తుపానుకు ‘దానా’ అని నామకరణం చేసినట్టు తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఆర్ఎంసీ వివరించింది. ఇది వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది.
కాగా, ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా, అక్టోబరు 24వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 25న కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు… ఈ నెల 24,25 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు… రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వీలైనంత తొందరగా తిరిగొచ్చేయాలని సూచించింది. తుపాను తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.