భారత్ సమాచార్, హైదరాబాద్ ;
హైదరాబాద్ నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు(AMVI) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించారు. హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నేడు చెప్పారు. దీనిలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు వెల్లడించారు..
☑️నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం తెలిపారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు.
☑️రవాణా శాఖలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి సేవలు అందించడంలో ప్రజలతో గౌరవప్రదంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
☑️ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుతూ పది నెలల్లో 50 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.
☑️ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసిన సమయం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిన సందర్భమన్నారు.
☑️ఇప్పుడు ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు గ్రామాల్లో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించాలని కోరారు.
☑️గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. గృహ ప్రవేశాల్లాంటి శుభ సందర్భాల్లో మత్తు పదార్థాలు తీసుకుని బుకాయించే సంస్కృతి రానీయొద్దన్నారు.
☑️10 నెలల్లో 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశామన్నారు.
☑️బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల 1.05 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారని తెలిపారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోందన్నారు.
☑️200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటున్న 49.90 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చామన్నారు.
☑️ఆడబిడ్డలకు రూ. 500 కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు.
☑️రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.