భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై సొంత పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాజీవ్ గాంధీ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని.. అలాంటి వ్యక్తి దేశ ప్రధాని ఎలా అయ్యారో అంటూ వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజీవ్గాంధీ, తాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నామని.. ఆయన పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని తెలిపారు. యూనివర్సిటీ ఇమేజ్ను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఉత్తీర్ణులవుతారని.. కానీ కేంబ్రిడ్జ్లోనూ.. లండన్లోని ఇంపీరియల్ కాలేజీలోనూ రెండు చోట్ల రాజీవ్ గాంధీ ఫెయిల్యూర్ అయ్యారన్నారు. అలాంటి వ్యక్తి.. దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు తాను చాలా ఆశ్చర్యపోయానని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు.
మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ కోవర్టుగా మారి వ్యక్తిగత విమర్శలకు దిగారని కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ చదువులో ఫెయిల్ అవ్వడం పెద్ద విషయం కాదని.. ఉత్తమ వ్యక్తులు కూడా కొన్నిసార్లు విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ చదువులో విఫలమైతే.. రాజకీయాల్లో విఫలం కాలేదు కదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ప్రవేశపెట్టిన విధానాలను ఆయన గుర్తు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పదే పదే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి చరణ్ సింగ్ సప్రా. బీజేపీకి తొత్తుగా మరి.. కాంగ్రెస్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే గతంలోనూ మణిశంకర్ అయ్యార్ సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు, పతనానికి గాంధీ కుటుంబమే కారణమని.. పదేళ్లలో పార్టీ అగ్ననాయకురాలు సోనియా గాంధీతో ఒక్కసారి కూడా సమావేశం అయ్యేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. అంతేకాదు రాహుల్, ప్రియాంక గాంధీలతో కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే సమావేశం అయినట్లు తెలిపారు. కాంగ్రెస్లో చిన్న నేతలకు గుర్తింపు ఉండన్నారు. నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.