భారత్ సమాచార్.నెట్,ఏపీ: ఏపీ (AP) రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి రూ. 64,721 కోట్లు ఖర్చవుతుందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ)లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ.64,721.48 కోట్లు ఖర్చవుతుందన్నారు.
ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధులు సేకరించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను దశల వారీగామూడేళ్లలో రైతులకు అప్పగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచంలో టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని రాజధానిని సీఎం డిజైన్ చేశారన్నారు.
ఇక అమరావతిలో, ప్రధాన రోడ్లు, లాంచింగ్ బిల్డింగులు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, మరియు అధికారుల భవనాలు మొదలైన వాటిని మూడేళ్లలో పూర్తి చేయాలని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే రాజధానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిపి రూ. 13,400 కోట్ల రుణం ఇస్తున్నట్లు వెల్లడించారు. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు రూ. 5 వేల కోట్ల రుణం ఇస్తుందని.. హడ్కో నుంచి రూ. 11 వేల కోట్ల రుణం రెండు మూడు రోజుల్లో వస్తుందన్నారు. అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ ఆఫీసులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఇకపోతే గత పాలకులపై కూడా మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ప్రభుత్వం మారగానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట ఆడి ఎక్కడా రాజధాని చేయలేదన్నారు. గత ఐదేళ్లలో రాజధానికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారని శాడిజంతో కక్ష సాధింపుతో ఆర్ 5 జోన్ చేసి 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారన్నారు. వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని చెప్పారు. వేరొక చోట స్థలం కేటాయించి అమరావతి భూములను రాజధాని కోసం తీసుకుంటామన్నారు.