భారత్ సమాచార్.నెట్,నేషనల్: ప్రస్తుతం ప్రతి ఒకర్కరు యూపీఐ (UPI) సేవలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ (Inactive) మొబైల్ నెంబర్స్ లేదా రీ అసైన్డ్ (Reassigned) మొబైల్ నెంబర్లపై యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ సేవలను నిలిపివేయనున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇనాక్టివ్ లేదా ఇతరులకు తిరిగి కేటాయించిన మొబైల్ నెంబర్లను యూపీఐ వ్యవస్థ నుంచి తొలగించాలని ఆదేశించింది.
యూపీఐ వినయోగంలో మొబైల్ నెంబర్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, అనధికార లావాదేవీలు మరియు మోసాలను నిరోధించేందుకు ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంది మొబైల్ నెంబర్ మార్చిన తర్వాత.. బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయకుండా వదిలేస్తారు. ఇదే సమయంలో పాత నంబర్లను వాడకుండా చాలా కాలం వదిలేస్తే.. అదే నెంబర్లను టెలికాం సంస్థలు కొత్త కస్టమర్లకు కేటాయిస్తుంటాయి. ఇదే మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని ఎన్పీసీఐ గుర్తించింది.
ఇనాక్టివ్ నెంబర్లను డీ లింక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేసింది. ఇక ఎన్పీసీఐ ఆదేశాల మేరకు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి యాప్లు, బ్యాంకులు ఇనాక్టివ్ నెంబర్లను తొలగించనున్నాయి. అయితే ఇది మొబైల్ నెంబర్ మార్చినప్పటికీ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయని వారిపై ప్రభావం పడనుంది. అలాగే యూపీఐకి లింక్ చేసిన నెంబర్ను కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ఉపయోగించకుండా చాలా కాలం పాటు పక్కన పెట్టిన వారికి.. పాత నెంబర్ వేరొకరికి ఇచ్చి ఉంటే వారిపై కూడా ఎఫెక్ట్ పడనుంది.