భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: 72వ మిస్ వరల్డ్ పోటీల(Miss World Pageant)కు తెలంగాణ (Telangana) ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.హైదరాబాద్లోని గచ్చిబౌలి (Gachibowli) ఇండోర్ స్టేడియంలో ప్రారంభం వేడుకలు జరగనుండగా.. మే 31న హైటెక్స్లో ఫైనల్స్ నిర్వహించనున్నారు.
25 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 22 ఈవెంట్లు జరగనుండగా.. 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు సహా విభిన్న రంగాలకు చెందినవారు రానున్నారు. ఇక ఈవెంట్ను కవర్ చేసేందుకు మరో 3 వేల మందికి పైగా దేశ, విదేశీ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు.
మే 6 నుంచి కంటెస్టెంట్స్ హైదరాబాద్కు రానున్నారు. మే 10న గచ్చిబౌలిలో మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమం జరగనుంది. ఈ పోటీల మధ్యలో తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేలా వివిధ ప్రాంతాల్లో రకరకాల ఈవెంట్లను నిర్వహించారు. తెలంగాణ వైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది. ఇకపోతే ఈ పోటీల కోసం మొత్తంగా రూ. 54 కోట్లు ఖర్చు కానుండగా.. ప్రభుత్వ శాఖలు తమ వాటాగా రూ. 27 కోట్లు ఖర్చు చేయనున్నాయి. మిగతా రూ. 27 కోట్లను మిస్ వరల్డ్ సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ వాటాగా ఉన్న రూ. 27 కోట్లను స్పాన్సర్ల ద్వారా సమీకరిస్తారు.