భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంటు సభ్యులు (Parliament Members), మాజీ సభ్యుల (Ex Parliament members)కు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శుభవార్త చెప్పింది. సభ్యుల జీతం, రోజువారీ భత్యం, పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. సవరించిన జీతభత్యాలు, పెన్షన్ పెంపు తక్షణమే అమలు కానున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఒక్కో ఎంపీ నెలవారీ జీతం (Monthly Salary) రూ.1,00,000 నుండి రూ.1,24,000 కు పెరిగింది. రోజువారీ భత్యం రూ.2,000 నుండి రూ.2,500కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యుల నెలవారీ పెన్షన్ రూ.25,000 నుండి రూ.31,000కు సవరించింది. మాజీ సభ్యులకు ప్రతి సంవత్సరం సర్వీస్కు అదనపు పెన్షన్ రూ. 2,000 నుండి రూ. 2,500కు పెరిగింది. కాగా కేంద్రం తాజా నిర్ణయాన్ని అధికార, ప్రతిపక్ష ఎంపీలు స్వాగతించాయి.
ఇకపోతే పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులు జీతంపై ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఒక ఎంపీకి 50 వేల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. లక్ష 70 వేల ఉచిత కాల్స్, 40 లక్షల లీటర్ల నీరు, నివసించడానికి ప్రభుత్వ బంగ్లా (ఇందులో అన్ని ఫర్నిచర్, ఎయిర్ కండిషనింగ్) ఉన్నాయి. 1954 ఎంపీ జీతం, పెన్షన్ చట్టం ప్రకారం ఈ మార్పు చేయబడింది. 2018 తర్వాత ఎంపీల జీతం, పెన్షన్ను సవరించడం ఇదే తొలిసారి. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 48 వివరణలోని క్లాజు (v) కింద నిర్ణయించబడిన వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా ఈ సవరణ చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.