భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి (Sri Venkateshwara Swamy) ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam) వైభవంగా నిర్వహించారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేశారు ఆలయ అధికారులు.
ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేధ్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ శుద్ధి అనంతరం ఉదయం 11 గంటల తర్వాత నుంచి భక్తులకు స్వామివారి దర్శనాని కల్పించింది టీటీడీ. మరోవైపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా పలు సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శానాలు కూడా రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆణివార ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి(కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం) నిర్వహించడం ఆనవాయితీ. ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.