Homebreaking updates newsఆదివైద్యుడు ధన్వంతరి జయంతి ప్రత్యేకం

ఆదివైద్యుడు ధన్వంతరి జయంతి ప్రత్యేకం

భారత్ సమాచార్, నేటి ప్రపంచం;

ధన్వంతరిని నారాయణాంశ సంభూతుడిగా భారతీయులు కీర్తిస్తారు. మానవజాతికి చికిత్సా విధానాన్ని అనుగ్రహించిన ఆదివైద్యుడిగా భారత పురాణాల్లో ప్రస్తావించారు. శ్రీభాగవతం సహా వివిధ పురాణాల్లో ధన్వంతరి ప్రస్తావన ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఒకవైపు దేవతలూ మరోవైపు రాక్షసులూ – క్షీరసాగర మథనం జరుగుతున్న సమయం అది. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, ఆ వరుసలో పదకొండవవాడిగా పాలకడలిలోంచి స్ఫురద్రూపి అయిన ఓ పురుషుడు ఉద్భవించారు. పెద్దపెద్ద కళ్లూ, ఒత్తయిన కేశాలూ, అంతెత్తు ఆకారం, చిరుదరహాసం తో ఉన్న ఆ రూపాన్ని ముక్కోటి దేవతలూ రెప్పవాల్చకుండా చూశారు. అతను పీతాంబరాన్ని కట్టుకున్నాడు, మణికుండలాలు ధరించాడు, మెడలో దివ్యమాల మెరిసిపోతోంది. ఓ చేతిలో అమృతభాండం ఉంది. మరో చేతిలో వనమూలికలున్నాయి. అచ్చంగా శ్రీమన్నారాయణుడిలా ఉన్నాడు – కాదుకాదు, సాక్షాత్తూ నారాయణుడి అంశే! బ్రహ్మాదులు అతనికి “ధన్వంతరి” అని నామకరణం చేశారు.

ధన్వంతరి అంటే మనసుకు పట్టిన జాడ్యాల్నీ, శరీరానికి ముసురుకున్న వ్యాధుల్నీ తొలగించేవాడని అర్థం. పురాణాల ప్రకారం ధన్వంతరి ఆరోగ్యానికి అధిపతి. పరిపూర్ణ ఆయువు కోసం ఘనంగా ధన్వంతరీ వ్రతం చేయడం ప్రాచీన సంప్రదాయం. ధనత్రయోదశినాడు లక్ష్మీదేవితో పాటూ ధన్వంతరినీ పూజిస్తారు. ఏటా ధన్వంతరి జయంతిని సముద్ర తీరంలోనో స్వగృహంలోనో వైద్యశాలలోనో కలశాన్ని స్థాపించి పురాణాంతర్గతమైన ధన్వంతరి మహామంత్రాన్ని పఠించి వైద్యులకూ సంపూర్ణ ఆరోగ్యవంతులకూ తాంబూలాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ధన్వంతరి సూర్యనారాయణుడి ప్రియశిష్యుడు. ఆయన దగ్గరే ఆయుర్వేదం నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ద్వితీయ ద్వాపర యుగంలో కాశీ రాజ్యాన్ని పాలించిన చంద్రవంశ రాజు ధన్వనృపాలుడి కొడుకుగా అవతరించిన ధన్వంతరి ఆయుర్వేదాన్ని శాస్త్రంగా మలిచి శుశ్రుతుడితో సహా ఎంతోమందికి బోధించాడనీ అనేక సంవత్సరాల పాలన తర్వాత తిరిగి దైవత్వాన్ని పొందాడనీ పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయుర్వేద వైద్యులకు ధన్వంతరే తొలిదైవం. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధన్వంతరి ఆలయాలున్నాయి. అందులో ఒకటి తెలుగు గడ్డమీదా ఉంది.

చింతలూరులో – ధన్వంతరి స్వామి ఆలయం

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. గౌతమీ తీరాన, పచ్చని పంటపొలాల మధ్య, సుమారు రెండెకరాల సువిశాల ఆవరణలో స్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఆలయంలో అడుగు పెట్టినంత మాత్రానే సమస్త రోగాలూ నయమైపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. విశాలమైన ముఖ మండపం ఉంది. గర్భాలయంలో ధన్వంతరి దివ్య మంగళరూపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. కాశీలో ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. నాలుగు హస్తాలతో ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో అమృతకలశం, ఒక చేతిలో జలగతో స్వామి దర్శనమిస్తాడు. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స ఓ భాగం. చెడురక్తాన్ని పీల్చుకునే శక్తి ఉందా జీవికి. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయాన్ని నిర్మించారు. పూజాదికాలకు ఏ లోటూ లేకుండా శాశ్వత ప్రాతిపదికన గ్రామంలోనే పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన వంశీకులైన ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి చలువరాతితో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు..

అమరవీరుడు అష్ఫాఖుల్లా ఖాన్ జయంతి

RELATED ARTICLES

Most Popular

Recent Comments