భారత్ సమాచార్, జాతీయం ;
కింది కోర్టులు ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందక పోతే, తమకు దక్కాల్సిన న్యాయం దక్కకపోతే… అవసరమైతే సుప్రీం కోర్టుకి అయిన వెళ్తాం అని టక్కున అనేస్తాం… కానీ, సుప్రీం కోర్టు తలుపు తట్టడం అంత ఆషమాషి విషయం కాదని అందరూ అనుకుంటారు. సుప్రీం కోర్టులో కేసు వేయటానికే లక్షల్లో ఖర్చు అవుతుందని భయపడుతుంటారు. డబ్బు లేని కారణంగా పేదలకు న్యాయం దక్కకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో దేశ అత్యున్నత న్యాయ స్థానం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇక పేదలు సుప్రీం కోర్టులో కేసు వేయటం చాలా సులువతుంది.
ఆ పథకం పేరు మధ్య ఆదాయ వర్గ (ఎంఐజీ) పథకం, నెలకు రూ.80 వేలలోపు, ఏడాదికి రూ.1.50 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు. వీరి కోసం సుప్రీంకోర్టు మధ్య ఆదాయ వర్గ న్యాయ సహాయ సొసైటీని ఏర్పాటు చేసింది. ఇందులో భారత ప్రధాన న్యాయమూర్తి ప్యాట్రన్ ఇన్ బీమ్ గా, అటార్నీ జనరల్ ఎక్స్ ఆఫీ షియో వైస్ ప్రెసిడెంట్ గా, సొలిసిటర్ జనరల్ గౌరవ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సభ్యులుగానూ ఉంటారు. కేవలం వెయ్యి రూపాయలతో సుప్రీం కోర్టు కి న్యాయం కోసం వెళ్లచ్చు. సొసైటీకి, రూ.750 సర్వీస్ చార్జి కింద చెల్లించాలి. అనంతరం పిటిషన్ ను సొసైటీలో దాఖలు చేయాలి. వీటిని అడ్వకేట్ ఆన్ దికార్డు (ఏఓఆర్)కు పంపిస్తారు. ఈ కేసు విచారణకు అర్హమైనదని ఏఓఆర్ భావిస్తే, దీనిపై కోర్టులో వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవాదికి బాధ్యతలను సొసైటీ అప్పగిస్తుంది. పిటిషన్ న్యాయ వివాదానికి అర్హమైనది కాదని ఏఓఆర్ నిర్ణయిస్తే సర్వీస్ ఛార్జి కింద వసూలు చేసిన రూ.750 మినహాయించుకుని మిగతా సొమ్మును వెనక్కు ఇచ్చేస్తారు. సొసైటీ ద్వారా సుప్రీంకోర్టులో దాఖలయ్యే కేసులు సాధారణ కేసుల్లాగే విచారణకు వస్తాయి.
ఇందులో తీర్పు ఎలా వచ్చినా దాంతో సొసైటీకి సంబంధం ఉండదు. కేసు దాఖలు చేయటం, న్యాయవాదిని ఎంపిక చేసుకోవటంలో మాత్రమే సొసైటీ సహకరిస్తుంది. సాధారణ ఫీజుతోనే తమ వివాదాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి న్యాయం పొందే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలన్నదే సొసైటీ ఉద్దేశం. కేసును చేపట్టిన న్యాయవాది నిర్లక్ష్యం వహిస్తున్నాడని నిరూపణ అయితే సుప్రీం కోర్టు సదరు న్యాయవాదిని పథకం ప్యానెల్ నుంచి తొలగిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సుప్రీం కోర్టు అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి.