భారత్ సమాచార్, రంగారెడ్డి : ఆన్లైన్ మోసాలపై, ఆన్లైన్ గేమ్స్పై యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా డబ్బులు పొగొట్టుకుని ఎంతోమంది నష్టపోతున్నారు. ఆన్లైన్ గేమ్స్కు బానిసైన ఓ యువతి అప్పులపాలైంది. పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు మళ్లీ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయింది. తీరా తన వద్ద డబ్బులు అన్ని అయిపోవడంతో సొంత ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పొగొట్టుకున్న డబ్బు రాబట్టేందుకు చోరీ డ్రామా:
ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన యువతి భారీగా డబ్బులు పొగొట్టుకుని సొంత ఇంట్లో దొంగలు పడ్డారని తల్లిదండ్రులను నమ్మించి డబ్బు మొత్తం కాజేసి అప్పులు తీర్చాలని భావించింది. అసలు విషయం తెలిసి పోలీసులు ఆమెను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. డబ్బుకోసం కూతురు చేసిన పని చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. రాజేంద్రనగర్లో డిగ్రీ చదువుతున్న ఒక యువతి కోసం తల్లిదండ్రులు ఆమెకు లాప్టాప్తోపాటు మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే వాటిని చదువు కోసం కాకుండా ఆన్లైన్ గేమ్స్ కోసం యువతి వాడుకుంది. లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండటంతో తీవ్ర అప్పుల్లో కూరుకుంది. ఎలాగైనా సరే అప్పులు తీర్చుకోవాలని భావించిన యువతి ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకుంది. దీంతో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భారీ పథకానికి వ్యూహరచన చేసింది. తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోగానే ఇంట్లో ఉన్న బీరువాలో దాచుకున్న నగదు మొత్తాన్ని దోచుకుంది. తిరిగి ఎవరికీ అనుమానం రాకుండా బట్టలు మొత్తాన్ని చెల్లాచెదురుగా పడేసింది. తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని తాను స్నానం చేసి వచ్చేసరికి దొంగలు చోరీ చేశారని తల్లిదండ్రులను నమ్మించింది.
విషయం ఎలా తెలిసిందంటే..?
ఇది నిజమని నమ్మిన యువతి తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో ఉన్న వారితోపాటు సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. అయితే ఎవరూ కూడా ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో యువతిని పలుకోణాల్లో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తానే ఇంట్లో ఉన్న డబ్బులు, నగదు అపహరించినట్లు పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది. యువతి స్టేట్మెంట్తో ఒకసారిగా పోలీసులతోపాటు తల్లిదండ్రులు సైతం అవాకయ్యారు. యువతి ప్రవర్తన చూసిన పోలీసులు ఆమెకు తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచించారు.
మరికొన్ని కథనాలు…