భారత్ సమాచార్, జాతీయం ;
భారత్ లో సైబర్ క్రైమ్ కట్టడికి కేంద్ర ప్రభత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తాజాగా టెలికాం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ క్రైమ్ లో పాలు పంచుకున్న మొబైల్స్ లోని సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని టెలికాం కంపెనీలకు సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
భారత ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం మొత్తం 28,200 మొబైల్ హ్యాండ్ సెట్స్, సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్ సెట్స్లో దాదాపు 20 లక్షల ఫోన్ నెంబర్లను వినియోగించారు. రీవెరిఫికేషన్ అనంతరం ఈ సిమ్ కార్డులు అన్నింటిపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఫోన్లపై కూడా బ్యాన్ పడనుంది.
డిజిటల్ మోసాల నుంచి భారత పౌరులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం ఇటీవలనే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది . దీని ద్వారా సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కు అడ్డుకట్ట వేసే అవకాశం ఉన్నట్టు భావిస్తోంది. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, రియల్టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇతర విభాగాల మధ్య కోఆర్డినేషన్ వంటివి ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా సులభంగా జరపొచ్చు.టెలికం కంపెనీలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇష్యూయింగ్ అథారిటీస్ ఇలా పలు రకాల విభాగాలు అన్నీ ఈ ప్లాట్ఫామ్ కింద లింకై ఉంటాయి. ఒకే వేదికపై కలిసి పని చేస్తాయి. వీటి సమన్వయంతో పౌరుల డేటాకు భద్రత ఉంటుంది. సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది.