భారత్ సమాచార్, జాతీయం : ప్రపంచ అభివృద్ధికి ప్రధాన కారణం ఇంధనమే. అది లేకుంటే మనం ఇప్పుడు చూసే ప్రపంచం ఉండేది కాదు. అదొక్కటే లేకుంటే మన ప్రగతి వందల ఏండ్ల వెనకకు జారిపోతుందనే చెప్పవచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘భారత న్యాయ సంహిత’లోని కొన్ని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు పలు రాష్ట్రాల్లో ఆందోళన చేశారు. వాహనంతో ఢీకొట్టి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన(హిట్ అండ్ రన్) కేసుల్లో డ్రైవర్లకు విధించే శిక్షను పెంచాలని అందులో ప్రతిపాదించారు. దీంతో వారంతా ఆందోళనకు పూనుకున్నారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు కొరత ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇంధనం కొరత అవుతుందేమోనని పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. ప్రతీ బంకు ముందు బారులు తీరారు.
పెట్రోల్ ఇక దొరకదట..అనే పుకార్లు కూడా వ్యాపించడంతో మంగళవారం అర్ధరాత్రి దాక పెట్రోల్ బంకుల్లో లైన్లు కట్టి మరీ పెట్రోల్, డీజిల్ కొట్టించుకున్నారు. వంద రూపాయల పెట్రోల్ కొట్టించుకునే వారు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంతో 500,1000 రూపాయలది కొట్టించుకున్నారు. ఇక కార్ల యజమానులు ఫుల్ ట్యాంకు చేయించుకున్నారు. ఇతర గూడ్స్ యజమానులది అదే పరిస్థితి. దీంతో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. చాలా పెట్రోల్ బంకుల్లో నిల్వలు మొత్తం నిన్న రాత్రి వరకే అయిపోయినట్టు సమాచారం. దాదాపు అంతటా నో స్టాక్ బోర్డులు పెట్టారు.
దీన్ని బట్టి తెలిసేది ఏమంటే.. ఒక్క వస్తువుపైనే అందరూ ఆధారపడితే ఇలాగే ఉంటుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచితే పెట్రోల్, డీజిల్ పై ఆధారపడడం తగ్గుతుంది. దేశానికి బోలేడు ఆదాయం మిగులుతుంది. తద్వారా జనాలకు ఉపాధి కల్పించవచ్చు. లేదా సంక్షేమ పథకాలను అందించవచ్చు. ఈ విషయాలను పాలకులు చిత్తశుద్ధితో ప్రజలకు అవగాహన కల్పించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేయాలి. లేకుంటే భవిష్యత్ లో పెట్రోల్ భారం..భారతావని ఆర్థికాన్ని కిందకు తోస్తుందని ఖాయంగా చెప్పవచ్చు.