భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను హాట్ టాపిక్గా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Promotion Case)లో తెలంగాణ (Telangana) పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట (Punjagutta) పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన మరికొందరిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు తాజాగా.. వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Anchor Shyamala)ను విచారించారు.
దాదాపు మూడు గంటలపాటు శ్యామలను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్ల ద్వారా చనిపోయిన వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయబోనని కూడా తెలిపారు. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. చట్టంపై నమ్మం ఉందని.. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు నటి శ్యామల. కాగా, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈక్రమంలో శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇకపోతే ఈ కేసులో పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో యూట్యూబర్ భయా సన్నీ యాదవ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడు విదేశాల్లో ఉండటంతో లుక్ఔట్ నోటీసులు జారీ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు.. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు కూడా లిస్టులో ఉండటంతో.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల పీఆర్ టీంలు స్పందిస్తూ వివరణ ఇస్తుండగా.. పోలీసులు సారీలతో సరిపెడతారా.. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.