భారత్ సమాచార్, అమరావతి ;
అవయవదానంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేసింది. అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆస్పత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో జీవన్మృతుడికి సంబంధించిన భౌతికకాయానికి తగిన గౌరవం ఇచ్చేలా చూడాలని, అంత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈమేరకు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు రూ.10వేల ఆర్థిక సాయంతో పాటు జిల్లా కలెక్టర్ తరపున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.