Homemain slidesఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 2024

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2024

భారత్ సమాచార్, జాతీయం ;

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయాలు మొత్తం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే తిరుగుతున్నాయి. గ్రామాల్లో కూడా ఏ ఇద్దరు కలిసిన ప్రస్తుతం దీని గురించే చర్చిస్తున్నారు. మే 13న జరుగబోయే పోలింగ్ ను కూడా ప్రభావితం చేసేంతగా ఈ యాక్ట్ కు ప్రచారం కల్పించారు రాజకీయ నాయకులు. ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థలో చాలా లోపాలున్నాయని, వాటిని అధిగమిస్తూ కొత్త వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ యాక్ట్ ను తీసుకొచ్చినట్టు చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ యాక్ట్ వలన మీ భూములన్ని ప్రభుత్వ భూములుగా మారిపోతాయి అని ఆరోపిస్తోంది. ఈ యాక్ట్ కు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మీ కోసం.

దేశంలోనే మొదటి సారిగ…

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2024 ఈ చటం అమలుతో రాష్ట్ర భూముల చరిత్రలో కొత్త శకం మొదలుకానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాగా దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ చట్టాన్ని అమలు చేసింది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టంగా ప్రభుత్వం దీన్ని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 జూలైలో ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. కొన్ని మార్పులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దానికి ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో కూడా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అక్టోబర్‌ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌–2023 అమల్లోకి వచ్చింది.

ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30 కిపైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్‌మెంట్, ఈనాం వంటి 11 రకాల రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్‌ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో ఈ భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా ఈ వ్యవస్థలో లేదు.

ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌

ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్‌ రిజిస్టర్‌ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్‌లోనే కచ్చితంగా ఉంటుంది. దీని ద్వారా వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారం అవుతాయని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ టైటిల్‌ రిజిస్టర్‌నే చట్ట పరంగా కన్‌క్లూజివ్‌ రికార్డు అని పిలుస్తారు. అంటే అదే ఫైనల్ రికార్డు కింద లెక్క. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న రికార్డులన్ని ప్రిజెంటివ్‌ మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే లొసుగులు ఈ వ్యవస్థలో ఉన్నాయి. కానీ ఒకసారి కన్‌క్లూజివ్‌ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి వీలు పడదు.

వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ

ప్రస్తుత వ్యవస్థలో ఏదైనా భూవివాదం చోటుచేసుకుంటే రెవెన్యూ, సివిల్‌ కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒక ట్రిబ్యూనల్ ని ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాకు కూడా ఒక ట్రిబ్యునల్, మొత్తం రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యూనల్ ఏర్పాటవుతుంది.
ఏ భూ వివాదంలోనైనా రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్‌ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు వస్తే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లు మాత్రమే టైటిల్‌ రిజిస్టర్‌లో ఉంటాయి.

  • ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్‌. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. టైటిల్‌ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్‌ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్‌ రిజిస్టర్‌లో ఉన్న పేరే ఖరారవుతుంది.
  • టైటిలింగ్‌ చట్టం కింద రూపొందిన రిజిస్టర్‌ ప్రకారం ప్రిజెంటివ్‌ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ ఇక మీదట చెల్లవు. ఇప్పటి నుంచి భూమి హక్కుల చరిత్ర డిజిటల్ గా కూడా కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు.
  • పాత వ్యవస్థ స్థానంలో టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నప్పుడే టైటిల్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. అమ్మేవారికి టైటిల్‌ ఉంటేనే కొనేవారికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్‌ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్‌ వ్యవస్థలు కొత్తగా ఏర్పాటు అవుతాయి.
  • ఇది ఒక ల్యాండ్‌ మార్క్‌ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చట్టం అమలులో పేదల కోసం పారా లీగల్‌ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరియెంటేషన్‌ అవసరం. ఇది ఆర్‌ఓఆర్‌ చట్టం లాంటిది కాదు. కొత్తగా వస్తున్న చట్టం కాబట్టి అధికారులకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments