భారత్ సమాచార్. నెట్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే ప్రపంచ దేశాలపై టారిఫ్లు (Tariffs) విధించిన విషయం తెలిసిందే. అయితే సుంకాలు అమలులోకి వస్తే అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు భారీగా పెరిగి అక్కడ వాటికి గిరాకీ తగ్గిపోయే ప్రమాదం ఉందని భావించిన యాపిల్ (Apple) సంస్థ.. భారత్పై అమెరికా టారిఫ్లు విధించకముందే ముందుజాగ్రత్త పడింది. భారత్ నుంచి కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 5 విమానాల నిండా ఐఫోన్లు (iPhones), ఇతర ఉత్పత్తులను అమెరికాకు తరలించినట్లు సమాచారం.
ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రకటనతో .. యాపిల్ సంస్థ మార్చి నెలాఖరులో ఈ నిర్ణయం తీసుకుంది. పన్నును తగ్గించుకోవడానికి యాపిల్ సంస్థ భారత్, చైనాలో తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లను అమెరికాకు చేరవేసింది. ఇండియా నుంచి మూడు విమానాలు, చైనా నుంచి రెండు విమానాలు నిండుగా ఐఫోన్లు అమెరికా పంపింది. భారత్లో తయారు చేస్తున్న ఐఫోన్లు, ఇతర ప్రోడక్ట్స్ అమెరికాకు తీసుకెళ్లినప్పుడు అదనపు సుంకాలు విధస్తే వాటి ధర పెంచాల్సి వస్తుంది. టారిఫ్లు అమల్లోకి రాకముందే వాటిని తీసుకెళ్తే కొంత కాలం అయినా ధరలు పెంచకుండా ప్రస్తుత ధరలకే విక్రయించవచ్చని యాపిల్ భావించినట్లు తెలుస్తోంది.
ఇదే విధంగా రత్నాభరణాల రంగం సైతం ముందుగానే భారీగా ఎగుమతులు చేసినట్లు సమాచారం. ముంబై నుంచి ఈ నెల 1 నుంచి 4 తేదీల్లో అమెరికాకు రత్నాభరణాలు ఎగుమతులు చేసింది. ఈ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సేవలు- వస్తువుల ఎగుమతుల బిల్లు 800 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.6.84 లక్షల కోట్లకు మించవచ్చని అంచనాలున్నాయి. ఇకపోతే అమెరికా సంస్థ అయిన యాపిల్.. భారత్లో ఐఫోన్లు, ఇతర పరికరాల తయారీ అసెంబ్లింగ్ చేయిస్తోంది. ఇదివరకు భారత్ నుంచి అమెరికాకు చేసే ఫోన్ల ఎగుమతులపై సుంకాలు ఏమీ లేవు.