భారత్ సమాచార్.నెట్: గుజరాత్ (Gujarat)లో ఆసియా సింహాల (Asiatic Lions) సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Cm Bhupendra Patel) స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు సింహాల జనాభా (Lions Population)పై నిర్వహించిన సర్వే వివరాలను విడుదల చేశారు. ఐదేళ్ల క్రితం 674గా ఉన్న సింహాల సంఖ్య ఇప్పుడు 891కి చేరిందని చెప్పారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ సింహాలు జీవిస్తున్నట్లు చెప్పారు. జునాగఢ్, గిర్ సోమనాథ్, భావ్నగర్, రాజ్కోట్, మోర్బి, సురేంద్రనగర్, దేవభూమి ద్వారక, జామ్నగర్, అమ్రేలి, పోర్ బందర్, బోటాడ్లో ఈ సింహాలు విస్తరించినట్లు సీఎం చెప్పారు.
మే 10- 11 తేదీల్లో సింహాల ప్రాథమిక జనాభా గణన నిర్వహించగా.. తుది జనాభా గణనను మే 12-13 తేదీల్లో ప్రాంతీయ, జోనల్, సబ్-జోనల్ అధికారులు, ఎన్యూమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యూమరేటర్లు, ఇన్స్పెక్టర్లు సహా 3,000 మంది స్వచ్ఛంద సేవకుల సహాయంతో నిర్వహించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో గిర్ అడవుల్లోని సింహాల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు.
అడవిలో ఉన్న సింహాలను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇందులో సీసీ టీవీలు, జీపీఎస్, రేడియో కాలర్లు, ఆధునిక ఆయుధాల వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సింహాల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో.. వాటిని ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో పర్యాటకుల రాక కూడా విస్తృతంగా పెరిగిందని అటవీశాఖ వర్గాలు వెల్లడించాయి.