భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
తిరుమలలోని ఏడు కొండలపై కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించు కోవాలనుకునే భక్తుల సంఖ్యకు అంతే లేదు. ప్రపంచ దేశాల నుంచి ప్రతి రోజూ కూడా శ్రీనివాసుడిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. అలాంటి సేవల్లో ఈ ప్రత్యేకమైన సేవ కూడా ఒకటి ఉంది. ఈ సేవలో ఏడు కొండల వాడికి సేవ చేసుకునే అవకాశాన్ని రోజంతా కల్పిస్తోంది. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. ఈ సేవ టికెట్ ధర అక్షరాల రూ.కోటి. ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు ఆ రోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను నేరుగా దర్శించవచ్చు. అలా 25 ఏళ్లు, లేదా జీవితాంతం ఏది ముందయితే అందుకు తగ్గట్లుగా ఈ టికెట్ ను వినియోగించుకోనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఈ సేవల్లో భక్తుడితోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు.