భారత్ సమాచార్, జాతీయం : దేశ ఆధ్యాత్మిక ఆత్మ’గా అయోధ్య.. మతాలకతీతంగా రామయ్య దర్శనం!
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆ ప్రాంత రూపురేఖలే పూర్తిగా మారిపోతున్నాయి. దేశంలో ఎన్నో అల్లర్లకు, గొడవలకు కారణమైన బాబ్రీ, రామాలయ వివాదం కథ ఇప్పుడు సుఖాంతం కావడంతో దేశంలోని అన్ని వర్గాలకు ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో శాంతివీచికలు వీస్తున్నాయి. రామ్ లల్లాను చూసి తరించడానికి మతాలకు అతీతంగా భక్తులు ప్రతి రోజూ అయోద్యకు తరలివస్తున్నారు.
రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం భక్తులు కూడా తరలివస్తుండడం మరో విశేషం. తాజాగా లక్నో నుంచి 350 మంది ముస్లింలు అయోద్య రామయ్య దర్శనం కోసం గురువారం అధ్యాత్మిక నగరానికి చేరుకున్నారు.
‘‘భగవాన్ శ్రీ రాముడు మన పూర్వీకుడు .. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం అయిన ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయడం లేదంటే అసహ్యించుకోవాలి అని బోధించదు’’ అని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రయీస్ తెలిపారు.
రాష్ట్రీయ్ స్వయం సేవక్ మద్దతు గల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం రామ దర్శనం కోసం బయల్దేరింది. ముస్లింల బృందం లక్నో నుంచి కాలినడకన అయోధ్య చేరుకుంది. చలిలో 150 కిలోమీటర్లు కాలినడకన వచ్చి తమ భక్తిని చాటుకుంది. ‘ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. రాత్రి పడుకొని, మరునాడు బయలుదేరాం. ఆరు రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నాం. బాల రాముడిని దర్శించుకొని తరించాం. రాములోరి దర్శనం హిందు- ముస్లింల ఐక్యతను పెంచి, దేశ సమగ్రతను కాపాడుతుంది.’’ అని వారు తెలిపారు.
ఇలా అయోధ్య కులమతాలకు అతీతంగా దేశంలో ఒక అధ్భుత ప్రాంతంగా మారుతోంది. ‘దేశ ఆధ్యాత్మిక ఆత్మ’గా రూపొందుతోంది. అయోధ్య రామాలయంతో ఉత్తరప్రదేశ్ రాత, భవిత మారబోతోంది.