భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ మధ్య వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఫ్యామీలి పార్టీ అయిన బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వారి పని అయిపోయిందని.. బీఆర్ఎస్ను నడపలేక ఆ పార్టీ అధినేత కేసీఆరే చేతులెత్తేశారన్నారు.
బీఆర్ఎస్ నేతలు పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయారని.. ఆ ఆక్రోశంతోనే కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రధాని సహా బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకమీదట ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి. కేటీఆర్పై సీఎం రమేష్ చెప్పింది అక్షరాల నిజమని.. సీఎం రమేష్ చేసిన సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
సీఎం రమేష్తో కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని.. కావాలంటే సీఎం రమేష్ను నేను తీసుకొస్తానని.. తేదీ, సమయం ఫిక్స్ చేయాలని కేటీఆర్కు సవాల్ విసిరారు బండి సంజయ్. కాగా కవిత లిక్కర్ కేసులో బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతామని కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించారు సీఎం రమేష్. అంతేకాదు విలీనం గురించి తన ఇంటికి వచ్చింది కూడా మర్చిపోయారా అంటూ నిలదీశారు.