భారత్ సమాచార్, జాతీయం : 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు మార్చి 11న దేశంలో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
1. మార్చి 12 లోగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కోర్టుకి, ప్రజలకి అందించాలని ఎస్బీఐను సుప్రీంకోర్టు మార్చి11న ఆదేశించింది.
2. అదే రోజు సాయంత్రానికి 2019లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు సంబంధించిన నిబంధనలను నోటిఫై చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం ఈ సవరణ లక్ష్యం. ఇందులో ముస్లింలను చేర్చకపోవటం వివాదాలకు దారితీసింది.
రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాల్లో బీజేపీ మొదటినుంచి అగ్రస్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల బాండ్ల ద్వారా కాషాయపార్టీకి దాదాపు రూ.2,555 కోట్ల రూపాయలు సమకూరినట్లు ఆ పార్టీ అధికారికంగా తెలిపింది.
బీజేపీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. కాషాయ పార్టీ కొన్ని బడా కంపెనీలకు లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వ నిబంధనలు మార్చి వాటికి సహాయం చేస్తోందని వాదన. వాటికి ప్రతిఫలంగానే ఎన్నికల బాండ్ల ద్వారా పెద్ద సంస్థలు వేల కోట్లు బీజేపీకి ముట్టచెప్పుతున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు.
ఎన్నికల ముందు ఈ వివరాలు అన్ని ప్రజల ముందు ఉంచితే, అవి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. ఈ ఎలక్షన్ లో కాషాయ పార్టీ యువత ఓట్లు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కారణంగానే అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం సీఏఏ ను ప్రజలు ముందుకు తెచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం ఎలక్షన్ బాండ్ల అవినీతి గురించి కాకుండా, సీఏఏ గురించి మాత్రమే చర్చిస్తుందని బీజేపీ ఎత్తుగడ.
2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ మరోసారి అధికారం దక్కించుకోవటానికి ఇంకా ఎన్ని వ్యూహాలు రచిస్తుందో, వాటి ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందో వేచి చూడాలి.