భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ బోనాల పండుగ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ప్రతి ఏడాది బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నెలరోజులపాటు జరిగే ఈ బోనాలకు లక్షలాదిమంది భక్తులు ఆయా ప్రాంతాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించుకొని మొక్కులను చెల్లించుకుంటారు
ఏ రోజును ఎక్కడంటే:
ఆషాడ మాసంలోని తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో నిర్వహించే ఉత్సవాలతో బోనాలు మొదలవుతాయి. అప్పటి నుంచి నెలరోజుల పాటు జరిగే ఈ పండుగ ఎన్నో విశేషాలతో కొనసాగుతుంది. ఈ ఏడాది జూన్ 26నుంచి జూలై 26వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. జూన్ 26న గోల్కొండ బోనాలు ఉత్సవాలతో ప్రారంభమవుతాయి. జూన్ 29న విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పిస్తారు. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉంటుంది. ఆ తర్వాత రోజు జులై 14న రంగం భవిష్యవాణి ఉంటుంది. జులై 20న భాగ్యనగర లాల్ దర్వాజా బోనాల జాతర ఉంటుంది. జులై 21న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు నిర్వహించనున్నారు. 24న బోనాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. నెలరోజులు పాటు జరిగే ఈ బోనాల జాతరను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.