భారత్ సమాచార్.నెట్: ప్రముఖ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల సూర్య నటించిన ‘రెట్రో’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ.. తన ప్రసంగంలో గిరిజనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ కామెంట్స్ గిరిజనుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపిస్తూ గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయ్ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని.. గిరిజన సమాజాన్ని అగౌరవపరిచే విధంగా ఉన్నాయని గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 16వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగా విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
ఇకపోతే సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్థాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయి.’ ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గిరిజన సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు. గిరిజనులను కించపరిచేలా, అవమానించేలా విజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కాగా విజయ్ వ్యాఖ్యలపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది.