భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యాక తాజాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యో గులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా వరంగల్, హన్మకొండ, మహబూ బాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట జిల్లాలతోపాటుగ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర సీఈవో సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిప్టుల సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు గానీ, మధ్యలో వెళ్లి ఓటు వేసి వచ్చేందుకుగానీ అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కోరారు. ఈ మేరకు అన్ని ప్రవేటు సంస్థలు, కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు.