భారత్ సమాచార్, రాజకీయం ;
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో మాచర్ల, తాడిపత్రి వంటి నియోజకవర్గాల్లో ఇరు పక్షాల రాజకీయ వర్గాల మధ్య హింస చోటుచేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లపై ఏపీ ఈసీ సీఈవో, డీజీపీ వివరణ ఇవ్వటానికి నేడు దిల్లీకి వెళ్లారు. అయితే ఈ రాజకీయ హింస ఏపీలో మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా టీడీపీకి ఓటు వేశారనే కారణంతో విశాఖ లో ఆడవారిపై వైసీపీ మూకలు దాడి చేశాయని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆరోపించారు.
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా వ్యాపించిందన్నారు. విశాఖ నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి, టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై వైసీపీ మూకలు దారుణంగా దాడిచేశారని ఆరోపించారు. మానవత్వం లేకుండా ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారన్నారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు.
పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్టు చేయాలన్నారు. మాచర్లలో మారణహోమానికి కారణం అయిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదన్నారు.
అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనంగా నిలిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా, వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.