భారత్ సమాచార్, జాతీయం ;
తల్లి తన కష్టార్జితంతో సొంతంగా సంపాదించుకున్న ఆస్తిపై ఆమె పిల్లలకు కూడా హక్కులు ఉండబోవనీ, దాన్ని తనకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకునే అధికారం ఆమెకు ఉంటుందని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఆస్థిపై హక్కులను ఆధారాలతో కోరాలేగానీ విభిన్న ప్రకటనలతో, ఊహాజనితంగా కోరేందుకు వీల్లేదని పేర్కొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంట్లో మూడో వంతు వాటాను ఇవ్వకుండా పెద్ద కుమారుడి పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ ను డీడ్ చేసిన ఒక తల్లి చర్యను సివిల్ కోర్టు సమర్ధించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ను కొట్టేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరపు లాయర్ వాదిస్తూ, 1988లో తన క్లెయింట్ తండ్రి ఇంటిని కొనుగోలు చేసి ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. తండ్రి మరణానంతరం ముగ్గురు కొడుకుల పేరుతో విల్డీడ్ చేశారనీ, ఆ తర్వాత దాన్ని రద్దు చేసి పెద్ద కొడుకు రాజేంద్ర అగర్వాల్ పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ చేయడం చెల్లదని వాదించారు. మూడో వంతు వాటా తన క్లెయింట్ కు కూడా వస్తుందని అన్నారు. అయితే ఇది తల్లి సుశీల్అగర్వాల్ స్వార్జిత ఆస్తి అని ఆమె తరపు లాయర్ వాదించారు. దీనిపై హైకోర్టు, తల్లి విల్డీడ్ చేసినప్పుడు సమర్ధించిన పిటిషనర్, దాన్ని రద్దు చేశాక అన్యాయమంటూ కోర్టుకు రావడాన్ని తప్పుపట్టింది. ఆస్థిని ఉమ్మడి కుటుంబ ఆస్థిగా ప్రకటించాలనే వాదన చట్ట వ్యతిరేకమని తేల్చింది. ఈ విషయంలో తల్లికే పూర్తి హక్కులు ఉంటాయని తీర్పు వెలువరించింది.