భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ (Tollywood)లో థియేటర్స్ (Theaters) వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రెంటల్ విధానానికి బదులు పర్సెంటేజీల సిస్టమ్ (Percentage System) తీసుకురావాలనే డిమాండ్ ఈ వివాదం మొదలైంది. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయనున్నట్లు ఇటీవల వార్తులు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా థియేటర్ల బంద్పై క్లారిటీ ఇచ్చింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్.
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. శనివారం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సమాలోచనలు జరగ్గా, అనంతరం మీడియాతో ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మాట్లాడారు. థియేటర్ల బంద్పై వదంతులు వ్యాపించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ గురించి చర్చలు జరగకపోతే ఆ దిశగా అడుగులు పడతాయని మాత్రమే తాము చెప్పామన్నారు.
కానీ థియేటర్ల బంద్ ఖాయం అనేలా ప్రచారం జరగడం విచారకరమన్నారు. ఒక సినిమా నేపథ్యంలో థియేటర్లు బంద్ అవుతాయంటూ వార్తలు రావడం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలున్నాయని, అవన్నీ పరస్పర సంబంధం కలిగినవేనని, వాటిని ఒకదానికొకటి కలపకుండా ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా థియేటర్లలో పర్సంటేజీ విధానంపై గత కొన్నేళ్లుగా చర్చలు జరగలేదని, ప్రస్తుతం మాత్రం ఈ అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు.