భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్లో సినిమాల నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఓ భారీ స్టూడియో నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. టాలీవుడ్ హీరో, డిప్యూటీ సిఎం పవన్కళ్యాణ్ను ఇటీవల సినిమా పెద్దలు కలిసి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. వారంతా ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ విస్తరణకు అవకాశాలపై చర్చించారు. దీని నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నందిగామాకంచికచర్ల ప్రాంతాల్లో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించనుందనేది సమాచారం. హైదరాబాద్కు నాలుగు గంటల ప్రయాణం, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్పోర్టు, విజయవాడ రైల్వే జంక్షన్, రాజధానికి అమరావతికి అతి సమీప ప్రాంతం కావటంతో ఈ ఎంపిక జరిగినట్లుగా సమాచారం. త్వరలో సినీ పరిశ్రమ పెద్దలతో పవన్కళ్యాణ్ మరో దఫా చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ చేస్తారని తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే స్టూడియోలు నిర్మించిన నామమాత్రపు రుసుంతో స్టూడియో అద్దెకిస్తున్నాయి. ఇదే విధంగా రాష్ట్రంలో స్టూడియో నిర్మించి సినిమాలకు ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.