భారత్ సమాచార్, దిల్లీ ;
న్యాయవాదిగా లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా ఓ న్యాయవాది- ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తున్నాడని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై స్పందించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సైతం నోటీసులు జారీ చేసింది. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ పై న్యాయవాది మహ్మద్ కమ్రాన్ వేసిన పిటిషన్ పై జస్టిస్ అభయ్ , జస్టిస్ ఏజీ మసిహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా, న్యాయవాది కమ్రాన్- ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కూడా పనిచేస్తున్నట్టు ధర్మాసనానికి తెలిసింది. దీనిని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం.. లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న వారు ఇతర వృత్తుల్లో ఉండకూడదు! అయితే, సుప్రీంకోర్టు కమ్రాన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు, లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న కమ్రాన్ ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తుండటంపై బార్ కౌన్సిల్ తో పాటు యూపీ బార్ కౌన్సిల్ కు సుప్రీంకోర్టు పలు ఆదేశాలిచ్చింది.