భారత్ సమాచార్.నెట్, కృష్ణ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) పురస్కరించుకొని ఈ నెల 21న విశాఖపట్టణం (Visakhapatnam)లో ఐదు లక్షల మందితో ‘యోగాంధ్ర’ (YogaAndhra) పేరుతో మెగా ఈవెంట్ను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముందు జూన్ 11న అంటే రేపు బెరం పార్కు వద్ద కృష్ణ నదిలో ‘ఫ్లోటింగ్ యోగా’తో ప్రపంచ రికార్డును సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఏపీ సర్కార్.
ప్రజలలో యోగ పట్ల అవగాహన పెంచేందుకు,ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేయాలనే లక్ష్యంతో.. ఈ కార్యక్రమాన్ని నీటిమీద యోగా చేసే విధంగా చేపడుతున్నారు. పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్స్పై వెయ్యిమందితో కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాసనాలు వేయనున్నారు. దీని ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నదీ తీరంలో ఉదయం సూర్య కిరణాల మధ్య అందమైన ప్రకృతి దృశ్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఈ భారీ ఈవెంట్ నిర్వహణకు జిల్లా యంత్రాంగంతోపాటు ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మత్స్య శాఖలు, అమరావతి బోటింగ్ క్లబ్, ఈతగాళ్ల సంఘం, యోగా శిక్షణ సంస్థలు కలిసి భాగస్వామ్యమవుతున్నాయి. ఫోటింగ్ యోగా కార్యక్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు కూడా తీసుకుంటోంది. ఈతగాళ్లను, లైఫ్ జాకెట్లను, అనుభవజ్ఞులైన బోటు నిపుణులను అందుబాటులో ఉంచనున్నారు.