భారత్ సమాచార్, హైదరాబాద్ ;
🔹అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్టుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
🔹ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావులతో కలిసి సచివాలయంలో విద్యావేత్తలు ప్రొ.హరగోపాల్, ప్రొ. కోదండరాం, ప్రొ.శాంతా సిన్హా, ప్రొ.అల్దాస్ జానయ్య, ప్రొ.పద్మజా షా, ప్రొ.లక్ష్మినారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలోని పలు సమస్యలు, అంశాలను వారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
🔹విద్యా రంగం బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న పలు విషయాలను సీఎం వివరించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని, అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
🔹11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ, ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణ, పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫాంలు, పాఠ్య పుస్తకాల అందజేత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి చర్యలను వివరించారు.
🔹విద్యా రంగం బలోపేతానికి మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ లతో ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులపై విధాన పత్రం రూపొందించి వాటిపై సబ్ కమిటీతోనూ చర్చించాలని వారికి సూచించారు.
‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’
🔹17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ
🔹హైదరాబాద్ లోనే మెయిన్ క్యాంపస్.. కంపెనీల భాగస్వామ్యం
🔹యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి
🔹ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టే యోచన
🔹స్కిల్ వర్సిటీ ముసాయిదాకు పలు మార్పులు సూచించిన సీఎం
తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈ యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిర్వహణకు అవసరమయ్యే నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు. కొత్త యూనివర్సిటీ ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’ అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
17 కోర్సులు, ఏటా 20వేల మందికి శిక్షణ
ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో (పీపీపీ మోడల్లో) స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పుతారు. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు.
మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు. ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్..తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడుతారు. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.