భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తోంది. దీనిలో ప్రధానంగా ధరణి, రైతుబంధు పథకాలు వంటివి కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల అనధికార లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నారు నేటి అధికారులు, కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో తాను కొనుగోలు చేసిన భూములపై మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఇప్పటి వరకు రూ.14, 05,550 రైతుబంధు తీసుకున్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం కూడా పంటలు సాగు చేసేందుకు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించింది. సోమేశ్ కుమార్ ఆ భూమిని సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు పంటలకు కలిపి రూ.2,52,750 చొప్పున రైతుబంధు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఆయన కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. సాగుకు అనువుగా లేకపోయినా.. రైతుబంధు కింద సాయం పొందినట్టు వెల్లడైంది. ఆయన చుట్టుపక్కల సాగుకు అనువు కానీ మొత్తం 150 ఎకరాలకు కూడా రైతుబంధు మంజూరైనట్లు అధికారిక లెక్కల్లో తేలుతోంది.
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలోని 25 ఎకరాల భూమిని సోమేశ్ కుమార్ కొనుగోలు చేశారు. 2018లో నలుగురు దగ్గర నుంచి ఈ భూమిని కొన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఒక్కో ఎకరం రూ.3 కోట్లు పలుకుతుండగా.. ఎకరాలకు రూ.2లక్షలు మాత్రమే చెల్లించి ఖరీదైన భూమిని కారు చౌకకు దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ భూమిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయడం వెనక ఏదో జరిగి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.