భారత్ సమాచార్, జాతీయం ;
హరియాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు భారీ సంఖ్యలో పోలీసుల బృందాలను మోహరించారు. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ దేశ రాజకీయాల్లో హరియాణా కీలక పాత్ర పోషిస్తుంటుంది. పదేళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న భాజపా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని విపక్షాలు భావిస్తున్నాయి.
హరియాణా ఎన్నికల ముఖచిత్రం
మొత్తం నియోజకవర్గాలు 90
బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 1,031
వారిలో మహిళలు 101
స్వతంత్ర అభ్యర్థులు 464
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,54,350
వారిలో పురుషులు 1,07,75,957
మహిళలు 95,77,926
ట్రాన్స్జెండర్లు 467
పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,632