భారత్ సమాచార్, విశాఖపట్నం ;
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకూ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనతి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24×7 అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి సూచించారు. అవసరమైన జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్టం చేయాల్సిందిగా సూచించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు.