భారత్ సమాచార్.నెట్, ఏపీ:
ఇస్రో మాజీ సీఎస్ సోమనాథ్ (Former CS Somanath) కు ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక బాధ్యతలు కట్టబెట్టింది. రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహదారునిగా సోమనాథ్ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వ్యవసాయ పనులు, విపత్తుల నియంత్రణ, ప్రభుత్వ పాలన, పరిశ్రమల నిర్వహణలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీ హబ్, టెస్టింగ్ సౌకర్యాల ఏర్పాటు, రీసెర్చ్ సెంటర్లు, క్లస్టర్ల ఏర్పాటులో ఆయన సూచనలు అందిస్తారు. కాగా, అంతరిక్ష సాంకేతికత రంగంలో సోమనాథ్కు 40 ఏళ్ల విశేష అనుభవముంది. 2022 నుంచి 2025 వరకు ఆయన ఇస్రో ఛైర్మన్గా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో ప్రొఫెసర్గా ఉన్నారు.
ఇకపోతే సోమనాథ్తో పాటు మరో ముగ్గురు ప్రముఖులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్ రెడ్డి(G.Sathish Reddy)ని నియమించగా.. చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల(Suchitra Ella)ను నియమించింది. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీ(KPC Gandhi)లను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు ఆ పదవుల్లో ఉండనున్నారు.
ఇదిలా ఉంటే సుచిత్ర ఎల్ల.. భారత్ బయోటెక్ సంస్థ సహ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్తోపాటు, ఎల్ల ఫౌండేషన్కు ఎండీగా ఆమె వ్యవహరిస్తున్నారు. కొవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ను అందించడంతో పాటు బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికిగాను 2022లో తన భర్త కృష్ణ ఎల్లతో కలిసి సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు.
అదేవిధంగా ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి.. సిస్టమ్స్ మేనేజర్, డీఆర్డీఓ ఛైర్మన్గా, డీడీఆర్డీ కార్యదర్శిగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్గా అత్యంత కీలక పదవులు నిర్వహించారు. ఇకపోతే కేపీసీ గాంధీ.. ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్త. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల ఫోరెన్సిక్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల డైరెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. ఇక ఫోరెన్సిక్ సైన్స్ సైన్స్కు సంబంధించి సొంతంగా ట్రూత్ ల్యాబ్స్ను స్థాపించి.. దానికి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.