భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం ఉద్యానశాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేయడం ద్వారా ఉద్యాన రైతులకు న్యాయం జరుగుతుందని ఉద్యానశాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుడిమళ్ల సందీప్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల విద్యాసాగర్, సభ్యులు అనిల్కుమార్, కీర్తి కృష్ణలతో ఆయన మంగళవారం రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యానశాఖ అధికారుల సంఘం సభ్యులు మాట్లాడుతూ.. 1982లో ఉన్న పోస్టులకు అదనంగా ఒక్క పోస్టు కూడా ఈ నలభై ఏళ్లల్లో శాంక్షన్ అవ్వలేదన్నారు. ఒక్కో ఉద్యాన అధికారికి 5 నుంచి 10మండలాలు కేటాయించాలని, వ్యవసాయశాఖ మాదిరి క్షేత్రస్థాయిలో ఉద్యాన విస్తరణ అధికారి (HEO) పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఉన్న ఉద్యాన అధికారుల సంఖ్యను రెండింతలు చేయాలన్నారు.
ఉద్యానశాఖ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి:
1982లో వ్యవసాయ శాఖ నుంచి ఉద్యానశాఖ వేరైనప్పుడు ఎన్ని ఉద్యాన అధికారుల (HO) పోస్టులు శాంక్షన్ ఉన్నాయో, ఇప్పటికీ అవే సంఖ్యలో పోస్టులు ఉన్నాయని, ఒక్కో ఉద్యాన అధికారి 5 నుంచి 10 మండలాలు తిరగాలని, కేవలం క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 100మంది మాత్రమే (రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని మినహాయిస్తే) పని చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ మాదిరిగా క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఉంటే కూరగాయలు, పండ్ల తోటలు, పామాయిల్ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, అవసరమైన వనరులు సైతం రాష్ట్రంలో ఉన్నాయని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యానశాఖ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరారు. హార్టికల్చర్ లో డిప్లొమా, బీఎస్సి, ఎంఎస్సి చేసిన ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వం ఉద్యాన విస్తరణ అధికారి, ఉద్యాన అధికారుల పోస్టులు భర్తీ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.