భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైలు (Metro Rail) ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెట్రో ప్రయాణికులకు (Metro Passengers) మెట్రో ఛార్జీల భారం తప్పక పోవచ్చని అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మెట్రో ఛార్జీల పెంపు తథ్యమని తెలుస్తోంది. జంటనగరాల పరిధిలో రోజూ లక్షలాది మంది పౌరులు మెట్రో రైలు సేవలను (Metro Services) ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య కారణంగా చాలా మంది ప్రజలు మెట్రో రైలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు వేగంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్లితే.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ (L&T) రూ.6,500 కోట్లకు పైగా నష్టాలను చవిచూసినట్టు ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే నష్టాలతో సతమతమవుతున్న ఎల్ అండ్ టీ సంస్థ రూ.59 హాలిడే సేవర్ కార్డును రద్దు చేసింది. రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీని కూడా ఎత్తివేసింది. బెంగళూరు మెట్రో తరహాలో మెట్రో ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెట్రోలో కనిష్ట ఛార్జీ రూ.10గా, గరిష్ట ఛార్జీ రూ.60గా ఉన్నప్పటికీ.. భవిష్యత్లో ఎంతవరకు పెరుగుతాయన్న స్పష్టత ఇంకా లేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లిన నేపథ్యంలో, 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో చార్జీలను పెంచేలా కేంద్రాన్ని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం, మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్-2002 ప్రకారం ఓ ఫేర్ ఫిక్సేషన్ కమిటీని (FFC) నియమించింది. ఈ కమిటీ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్రతిపాదనలు, అలాగే ప్రయాణికుల అభిప్రాయాలను పరిశీలించింది. అనంతరం మెట్రో చార్జీల పెంపుకు అంగీకారం తెలిపింది. అయితే, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పెంపును ఆమోదించకుండా తిరస్కరించింది.