భారత్ సమాచార్, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ అగ్రనేత వీహెచ్ హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం లోక్సభ సీటు తనకు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారని, భట్టి ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదన్నారు. మొదట సీటు ఇస్తా అన్నారు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదన్నారు. భట్టి ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణమన్నారు. భట్టిని ఎమ్మెల్సీ చేసేంది నేను అని ఆయన స్పష్టం చేశారు. నా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలన్నారు. నేను లోకల్ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు వీళ్లంతా లోకలా? అని వీహెచ్ హన్మంత రావు భట్టి విక్రమార్కని ప్రశ్నించారు.
చచ్చేంతే వరకు నేను పార్టీలోనే ఉంటా:
పార్టీ కోసం పదవులు ఆశించకుండా పని చేసిన తనకు న్యాయం చేయాలని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం లోక్సభ స్థానం తనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీసీ ఓట్లు కాంగ్రెస్కి అవసరం లేదా?, బీసీలు ఓట్లు వేసే మిషన్లా? వీహెచ్ ప్రశ్నించారు. ‘‘ రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర, కులగణన అంటున్నారు.. నాకు రాహుల్ గాంధీ న్యాయం చేయాలి. నేను పార్టీ కోసం పనిచేశా. చచ్చే వరకు పార్టీలోనే ఉంటా. చనిపోయిన తర్వాత కూడా పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారను. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశా. నా వయసు నాకు అడ్డంకి కాదు. ఈ వయసులోనూ రన్నింగ్ రేసులో పాల్గొంటా. రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే నేను తప్పుకుంటా. రాహుల్ రాకపోతే నేను ఖమ్మం నుంచి పోటీకి అర్హుడిని’’ అని వీహెచ్ హన్మంత రావు ఆవేదన వ్యక్తం చేశారు.