భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: ట్రంప్ టారిఫ్ల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం కుప్పకూలిపోయాయి. సెకన్ల వ్యవధిలో మార్కెట్లో లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఈ ప్రభావం భారతదేశ కుబేరులపైనా తీవ్రంగానే పడింది. టాప్-4 సంపన్నులు అంబానీ, అదానీ, సావిత్రి జిందాల్, శివ్ నాడార్ ల ఆస్తులు కరిగాయి. ఈ ఒక్కరోజే 10 బిలియన్ డాలర్లకు పైగా (భారత కరెన్సీలో దాదాపు రూ.85వేల కోట్లు) ఆవిరయ్యింది. ఈ మేరకు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా గణాంకాలు వెల్లడించాయి. బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. నిఫ్టీలో ఈ కంపెనీ షేరు విలువ దాదాపు 3.5శాతం పడిపోయింది. ఇంట్రాడేలో 7.4 శాతం నష్టంతో 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. దీంతో అంబానీ వ్యక్తిగత నికర సంపద ఏకంగా 3.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.30వేల కోట్లు) తగ్గి 87.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక అదానీ గ్రూప్ నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు కూడా 5శాతం మేర నష్టపోయాయి. దీంతో ఈ సంస్థ అధినేత గౌతమ్ అదానీ నికర సంపదలో 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25వేల కోట్లు) ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తుల విలువ 57.3 బిలియన్ డాలర్లకు తగ్గింది.
భారతదేశ సంపన్న మహిళ, ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్ నికర సంపద సోమవారం 2.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18వేల కోట్లు) మేర తగ్గి33.9 బిలియన్ డాలర్లకు చేరింది. సోమవారం జరిగిన ట్రేడింగ్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ షేర్లు దాదాపు 7శాతం పతనమయ్యాయి. ఇక,టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ల విలువ 3.3 శాతానికిపడిపోయింది. దీంతో ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ వ్యక్తిగత నికర సంపద 1.5 బిలియన్ డాలర్లు (రూ.12వేల కోట్లు) తగ్గి 30.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది.