భారత్ సమాచార్.నెట్: పాకిస్తాన్కు గూఢచర్యం (Pakistan Spy) చేస్తోందన్న ఆరోపణలపై హర్యానా (Haryana) యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జ్యోతి మల్హోత్రాకు తాజాగా హర్యానాలోని హిసార్ పరిధిలోని న్యాయస్థానం ఆమె పిటిషన్ను తిరస్కరిస్తూ.. మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody విధించింది. ఈ కేసును జూన్ 23వ తేదీన తిరిగి విచారించనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
అయితే జ్యోతి మల్హోత్రాను జ్యుడీషియల్ కస్టడీకి పంపడం ఇది రెండోసారి. అంతకు ముందు మే 26న ఆమెను నాలుగు రోజులపాటు రిమాండ్ విధించగా.. ఆ తర్వాత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. మరోవైపు జ్యోతి మల్హోత్రాతో లింక్ ఉన్న మరో యూట్యూబర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాన్ మహల్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జస్బీర్ సింగ్ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జస్బీర్ పాకిస్తాన్ మద్దతుతో నడుస్తున్న గూఢచార కార్యకలాపాలకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.
జస్బీర్ సింగ్, జ్యోతి మల్హోత్రా మధ్య తరచూ పరస్పర సంప్రదింపులు జరిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది. అదేవిధంగా జస్బీర్ సింగ్కు పాకిస్తాన్ నిఘా విభాగానికి చెందిన అధికారి షకీర్తో సన్నిహిత సంబంధాలున్నాయని దర్యాప్తులో తేలింది. అంతేకాదు, అతను పాక్ రాయబార కార్యాలయం అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సింగ్కు సంబంధాలున్నాయని, డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ జాతీయ దినోత్సవంలో కూడా సింగ్ పాల్గొన్నాడని, అక్కడ పాకిస్థాన్ ఆర్మీ ఆధికారులు, వ్లోగర్లను సింగ్ కలుసుకున్నాడని విచారణలో తేలింది.