భారత్ సమాచార్.నెట్, బెంగళూరు: బెంగళూరు (Banglore) వంటి పెద్ద పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు (Molestation) సాధారణమే అంటూ కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర (Karnataka Home Minister Parameshwara) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో.. హోంమంత్రి పరమేశ్వర దిద్దుబాటు చర్యలకు దిగారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని (Apologises) కోరారు.
తన ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. తన వ్యాఖ్యలను వక్రీకరించే అవకాశం ఇవ్వబోనని.. అందుకే తన వ్యాఖ్యలపై స్పష్టత ఇస్తున్నాని చెప్పారు. మహిళల భద్రతపై ఎప్పుడూ ఆందోళన చెందే వ్యక్తిని నేను అని.. వారి సంక్షేమం కోసం నిర్భయ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నమాని పేర్కొన్నారు. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా మహిళలు బాధపడి ఉంటే, వారి నుంచి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అని మంత్రి వివరించారు.
గత వారం (ఏప్రిల్ 3)న సుద్దగుంటెపాల్య ప్రాంతంలోని భారతి లేఅవుట్లో ఇద్దరు యువతులు రోడ్డు మీద నడుస్తుండగా, ఒక వ్యక్తి అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి, వారిలో ఒకరిపై అసభ్యంగా ప్రవర్తించి అక్కడినుంచి పారిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో యువతులు భయంతో ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా,ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బెంగళూరు పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.