భారత్ సమాచార్.నెట్, ముంబై: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Standup Comedian Kunal Kamra) బాంబే హైకోర్టు (Bombay Highcourt)ను ఆశ్రయించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Maharastra Deputy CM Eknath Shinde)పై చేసిన వ్యాఖ్యలపై కునాల్ కమ్రాపై పలుచోట్లు ఎఫ్ఐఆర్లు నమోదైయ్యాయి. అయితే ఈ అంశానికి సంబంధించి తనపై నమోదైన కేసులను రద్దు చేయాలంటూ ఆయన సోమవారం బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ (Quash Petition) ధాఖలు చేశారు. తన వ్యాఖ్యలు రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ, జీవించదలచిన హక్కును పరిరక్షించే పరిధిలోనే ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ ఏప్రిల్ 21న జరగనుంది.
ఇటీవల ముంబైలోని యూనికాంటినెంటల్ హోటల్లో ఉన్న హాబిటాట్ కామెడీ స్టూడియోలో జరిగిన షోలో కునాల్ కమ్రా ఏక్నాథ్ షిండేను ఉద్ధేశించి ‘ద్రోహి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై మహారాష్ట్ర (Maharastra) లో అనేక కేసులు నమోదయ్యాయి. తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. కానీ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే కునాల్ కమ్రా హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తమిళనాడులోని విల్లుపురానికి చెందిన కునాల్ కామ్రా మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్కు అవకాశం లేకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరగా, ఏప్రిల్ 7వ తేదీ వరకు అతనికి రక్షణ కల్పిస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే కునాల్ కమ్రా ఏక్నాథ్ షిండే పైనే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను టార్గెట్ చేస్తూ ఓ పేరడీ పాటను విడుదల చేశాడు కునాల్ కమ్రా. “మిస్టర్ ఇండియా” సినిమాలోని “హవా హవాయి” పాటను పేరడీ చేస్తూ.. పన్ను చెల్లింపుదారుల సొమ్ము అంతా వృధా అవుతుందని ఆరోపించారు. కాగా ఇటీవల స్టాండప్ షోల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్గా మారిపోయింది. ఈ తరహా ఘటనలు పెరిగుతుండటంతో కామెడీ షోల్లో అనుచిత వ్యాఖ్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.