భారత్ సమాచార్.నెట్: దేశీయ ఆభరణాల రంగంలో తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యువెల్లర్స్ (Lalitha Jewellers) త్వరలోనే తన మొదటి పబ్లిక్ ఇష్యూకు (Public Issue) రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీవో ద్వారా సుమారుగా రూ.1700 కోట్లను సమీకరించాలని లలితా జ్యువెల్లర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI)కు తగిన ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. ఐపీఓలో భాగంగా, లలితా జువెలరీ రూ.1200 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాదు, ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ స్వాధీనంలోని షేర్లను రూ.500 కోట్ల విలువకు విక్రయించనున్నారు.
ఐపీవో అంటే..?
ఐపీవో.. దీని అర్థం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. స్టాక్ మార్కెట్పై అవగాహన ఉన్నవారికి దీని గురించి ఐడియా ఉంటుంది. దీని ద్వారా ఒక కంపెనీ తన వాటాలని ప్రజలకు విక్రయిస్తుంది. ఇలా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణకు వినియోగిస్తుంది. వీటిని ఎస్ఎంఈ, మెయిన్ బోర్డు అనే రెండు రకాల ఐపీవోలుగా విభజించారు. చిన్న, మధ్య తరహా సంస్థలు విడుదల చేసే పబ్లిక్ ఇష్యూలను ఎస్ఎంఈ ఐపీవోలు అంటారు. మెయిన్ బోర్డు ఐపీవోలను పెద్ద కంపెనీలు, బాగా స్థిర పడిన సంస్థలు విడుదల చేస్తాయి.
1985లో ఏర్పాటైన లలితా జ్యువెల్లర్స్ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో సంస్థకు మొత్తం 56 స్టోర్లు ఉన్నాయి. 2022 నుంచి 2024 మధ్యకాలంలో కంపెనీ ఆదాయాలు సంవత్సరానికి సగటున 43.62 శాతం పెరుగుదలతో అభివృద్ధి చెందాయి. అయితే సంస్థపై కొంత మేర రుణ భారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐపీవో ద్వారా లభించే నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణకు ఉపయోగించనుంది.
ఐపీవో ద్వారా సమీకరించే మొత్తాన్ని 12 స్టోర్ల ఏర్పాటుకు.. అలాగే ఇతర కార్పొరేట్ అవసరాలను తీర్చేందుకు ఈ నిధులను కేటాయించనుంది. పబ్లిక్ ఇష్యూ పూర్తయ్యాక లలితా జువెలరీ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)ల్లో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఐపీఓకు ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఈక్విరస్ కేపిటల్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా.. ఎంయూఎఫ్జీ ఇన్టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐపీఓకు రిజిస్ట్రార్గా బాధ్యత నిర్వర్తిస్తుంది.