భారత్ సమాచార్, మంగళగిరి ;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన వన్య ప్రాణి వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు ఉంది. వాటిలో మనిషి ఒకడు. మనకున్న సాంకేతికత, విజ్ఞానంతో ఇతర జీవ రాశుల కంటే మనం ఉన్నత దశలో ఉన్నాం. మనపై ఆధారపడిన, మనతోపాటు జీవనం సాగించే ఇతర జీవ రాశులన్నింటినీ రక్షించుకుంటేనే మనిషి సాగిస్తున్న ఈ దశ స్వచ్ఛంగా సాగిపోతుంది. ఈ మాటలనే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి’’ అని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాఖల మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. వన్య ప్రాణులు, సముద్ర జీవులు, ఇతర జీవరాశి పూర్తి మనుగడలో ఉంటేనే మనిషికి స్వచ్ఛమైన గాలి, నీరు అందుతుంది. ఇతర జీవుల మనుగడ మీద మన ఉనికి ఆధారపడి ఉందనే విషయం నిత్యం గుర్తుంచుకోవాలని సూచించారు. పర్యావరణ, వన్య ప్రాణుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు.